ఢిల్లీ మద్యం కుంభకోణం: శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత.. కస్టడీ రిపోర్టులో సీబీఐ

  • శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లను కవిత ఇప్పించారన్న సీబీఐ
  • ప్రతిగా రూ. 14 కోట్లు కవితకు ముట్టాయంటూ కస్టడీ రిపోర్టు
  • అడిగిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవని శరత్‌ను కవిత బెదిరించారన్న సీబీఐ
ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలు పేర్కొంది. అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు ఇప్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు పేర్కొంది. ప్రతిఫలంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపింది. అంతేకాదు, తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ ఆయనను కవిత బెదిరించారని పేర్కొంది. 

ఐదు జోన్లు తనకు దక్కినందుకు బదులుగా కవిత నుంచి రూ. 14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు ఒప్పందం జరిగిందని, ఇది ఆయనకు ఇష్టం లేకున్నా తప్పని పరిస్థితులలో ఆయన చేశారని వివరించింది. భూమిని కొనుగోలు చేసినప్పటికీ భూ బదలాయింపు మాత్రం ఇప్పటికీ జరగలేదని తెలిపింది. అందులో భాగంగా జులై 2021లో రూ. 7 కోట్లు, నవంబరులో మిగిలిన రూ. 7 కోట్లు కవితకు శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్టు ఆధారాలు లభించాయని కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు కూడా సీఎస్ఆర్ కింద శరత్ చంద్రారెడ్డి రూ. 80 లక్షలు బదిలీ చేసినట్టు పేర్కొంది.

Delhi Liquor Scam
K Kavitha
Sarath Chandra Reddy
BRS

More Telugu News